ఓటీటీలో విడుదల కానున్న రానా మూవీ..!

By సుభాష్  Published on  18 Oct 2020 6:23 AM GMT
ఓటీటీలో విడుదల కానున్న రానా మూవీ..!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు ఏడు నెలల పాటు థియేటర్లు మూతబడ్డాయి. దీంతో చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల కాగా.. చాలా చిత్రాలను మాత్రం థియేటర్లు ఓపెన్‌ అయ్యాకే తమ సినిమాలను విడుదల చేస్తామని నిర్మాతలు వాయిదా వేసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు థియేటర్లకు ఓపెన్‌కు అనుమతి ఇచ్చింది. అయితే.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో థియేటర్లు తెరచుకోవడంలో ఆలస్యం అవుతోంది. కరోనా భయం ఉండడంతో ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు రావడం లేదు.

థియేటర్లు ఓపెన్‌ అయినా.. పూర్తి స్థాయిలో నడవాలంటే మరో రెండు మూడు నెలలు అయినా పట్టవచ్చు. దీంతో ఓటీటీ వైపే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. అందులో దగ్గుపాటి రానా నటించిన 'అరణ్య' కూడా చేరింది. ప్రభుసోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి అయి దాదాపు పది నెలలకు పైగా కావస్తోంది. సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాల్సి ఉండగా.. థియేటర్లు మూతబడడంతో ఇన్నాళ్లు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇన్నాళ్లు ఆగిన టీమ్ ఇప్పుడు అనూహ్యంగా ఓటీటీ కి ఒకే చెప్పారని తెలుస్తుంది. సినిమా పూర్తి అయ్యి 10నెలలు అవ్వడంతో.. ఇప్పటికి విడుదల చేయకుంటే.. బడ్జెట్‌ కంటే వడ్డీలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉండడంతో నిర్మాతలు ఓటీటీలో విడుదల చేయలనే నిర్ణయానికి వచ్చారనే వార్తలు ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది తెలియాలంటే.. చిత్ర బృందం ప్రకటన వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఈ సినిమా ఏకంగా 5 భాషల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా ఉంది.

Next Story