ఇక ఆగేది లేదంటున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు

By రాణి  Published on  3 Jan 2020 5:20 AM GMT
ఇక ఆగేది లేదంటున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కీలక ప్రకటన చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అణ్వాయుధ పరీక్షలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.అణు పరీక్షలపై తాము విధించుకున్న స్వీయ నిషేధంతో ఇక ఎలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ మధ్య అణ్వాయుధ నిరాయుధీకరణ ప్రధానాంశంగానే ఇప్పటివరకు చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో కొంత మేరకే పురోగతి నమోదయింది. అమెరికా తమపై విధించిన ఆంక్షలను సడలించాలని డిమాండ్ చేస్తూ 2019 చివరినాటికి గడువు విధించింది కిమ్ ప్రభుత్వం. ఈ విషయంపై ట్రంప్ ఎలాంటి ప్రకటనా ఇవ్వకపోవడంతోఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.త్వరలోనే ప్రపంచానికి సరికొత్త ఆయుధాన్ని చూపించనున్నట్టు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సంచలన ప్రకటన చేశారు.North Korea 4

అధికార వర్కర్స్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ కీలక సమావేశాల్లో కిమ్ చేసిన ప్రసంగాన్ని ఆ దేశ అధికార మీడియా ప్రచురించింది. ఆర్థిక ప్రయోజనాల కోసం భద్రతను పణంగా పెట్టాలని చూసే వ్యక్తిని కాదని కిమ్ స్పష్టం చేశారు. అణ్వాయుధాలు, బాలిస్టిక్‌ క్షిపణులపై స్వీయ నియంత్రణ విధించుకున్న ఉత్తర కొరియా, మధ్య శ్రేణి ఆయుధ సంపత్తిని మాత్రం భారీగా పెంచుకుంది.నిజానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతి సంవత్సరం నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకొని ఇచ్చే ఉపన్యాసం తీరులో ఈసారి మార్పు చోటు చేసుకుంది. సాధారణంగా ఉత్తరకొరియా అధ్యక్షుడి ఉపన్యాసాన్ని పూర్తిగా అధికార పత్రిక రొడోంగ్ సిన్‌మున్‌లో ప్రచురిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తుంటారు. తొలిసారి పార్టీ యూనిఫామ్ ధరించి ఉత్తర కొరియా బలగాలను ఉద్దేశించి కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగించారు. అయితే, ఈసారి జనవరి ఒకటో తేదీ ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. మధ్యాహ్నం కూడా అధికారిక టెలివిజన్ అధ్యక్షుడు ఉన్ ప్రసంగాన్ని పూర్తిగా ప్రసారం చేయలేదు. ఆయన ప్రసంగంలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రసారం చేసింది.North Korea 2

ఉత్తర కొరియా అణు పరీక్షలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలపై తనకు తానుగా విధించుకున్న మారటోరియానికి ఇంకెంతో కాలం కట్టుబడి ఉండకపోవచ్చని ఉన్ తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా గత రెండేళ్లుగా అనుసరిస్తున్న దౌత్య విధానం నుంచి తప్పుకోబోతున్నట్టు అధ్యక్షుడి ఉపన్యాసం సంకేత ప్రాయంగా తెలియజేస్తోంది. ఈ రెండేళ్ల కాలం లో అనుసరించిన విధానం వల్ల ఉత్తర కొరియాపై అమెరికా విధించిన ఆంక్షలు పెద్దగా సడలిపోలేదు. అణునిరాయుధీకరణ విషయంలో ఉత్తర కొరియా తీసుకున్న చర్యలు అమెరికాను కూడా పెద్దగా సంతృప్తి పరచలేదు. దీంతో కిమ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్నట్టు ఈ నిర్ణయం తీసుకోవటానికి ముందు కూడా కిమ్ ఒక ప్రమాదకరమైన పర్వాతాన్ని అధిరోహించారని అక్కడి మీడియా ఒక వీడియో విడుదల చేసింది.



Next Story