వీటి వల్ల పిల్లలు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.. తస్మాత్‌ జాగ్రత్త

By సుభాష్  Published on  10 Feb 2020 11:44 AM GMT
వీటి వల్ల పిల్లలు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.. తస్మాత్‌ జాగ్రత్త

-నేడు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం

నులి పురుగులు.. ఇవి చాలా ప్రమాదకరమైనవి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఎక్కువగా ఆటలు ఆడటం, మల విసర్జన ద్వారా నులి పురుగులు వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 10న జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన వల్ల నీరు కలుషితం కావడం, పిల్లలు ఎక్కడ పడితే అక్కడ మట్టిలో ఆడటం, తర్వాత చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల నులిపురుగులు వ్యాపిస్తాయని చెబుతున్నారు వైద్యులు.

ఈ నులిపురుగుల్లో అనేక జాతులున్నాయి. వాటినే ఏలిక పాములు, నట్టలు, కొంకి పురుగులుగా పిలుస్తుంటారు. మన దేశంలో 1 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలు మట్టిలో ఆడుకోవడం, తర్వాత చేతులు నోటిలో పెట్టుకోవడం వల్ల ఈ నులి పురుగుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది.

జాగ్రత్తలు

ఈ నులి పురుగుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమం. అలాగే భోజనం చేసే ముందు, మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఏదైన ఆహారం వండే సమయంలో కూరగాయలు పూర్తిగా ఉడికేటట్లు చూసుకోవాలి. వండిన తర్వాత పదార్థాలపై మూతలు పెట్టడం తప్పనిసరి. అలాగే ఈ నులి పురుగులు పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పిల్లలు శుభ్రత పాటించకపోతే బలహీనులుగా మారే అవకాశాలున్నాయి. వీటి వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలను పీల్చేసి వాటిని గ్రహించే శక్తిని తగ్గిస్తాయి. దీంతో విటమిన్‌ 'ఏ'ను హరింపజేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇక మరికొన్ని నులి పురుగుల వల్ల పిల్లల్లో ఆకలి మందగించి శక్తిని కోల్పోయేలా చేస్తాయి. మరికొన్ని అతిసారతో పాటు వాంతులు, విరేచనాలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నులి పురుగుల వల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఈ నులి పురుగుల వల్ల పిల్లలు తరుచూగా బరువు తగ్గడం, ఏకాగ్రత కోల్పోవడం కనిపిస్తుంటారు. ఇక పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపరు. అలసటగా కనిపిస్తుంటారు. ఈ పులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో, అంగన్‌వాడీ సెంటర్లలో, తదితర ప్రాంతాల్లో మాత్రలు పంపిణీ చేస్తుంటుంది.

పులి పురుగులను ఎలా గుర్తించగలం

కడుపులో, పేగుల్లో ఏర్పడే నులి పురుగులు సాధారణంగా 300పైగా వివిధ రకాలకు చెందినవిగా ఉంటాయి. వీటిని మైక్రోస్కోప్‌ ద్వారా చూసేందుకు సాధ్యమవుతుంది. అత్యంత చిన్నజీవులుగా మొదలుకొని దాదాపు 35 సెం.మీ వరకు ఉండే అవకాశాలుంటాయి. ఈ నులి పురుగుల్లో ప్రాణాంతకమైన టేప్‌ వర్మ్‌ కూడా మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ నులి పురుగుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story