ఆ రెండు పత్రికలపై లోక్సభ స్పీకర్కు విజయసాయి రెడ్డి ఫిర్యాదు..!
By Newsmeter.Network Published on 21 Nov 2019 3:25 PM GMTముఖ్యాంశాలు
- ఆ రెండు పత్రికలపై లోక్ సభ స్పీకర్ కు విజయ సాయి రెడ్డి ఫిర్యాదు
- తన ప్రతిష్టను భంగపరిచే విధంగా వార్త రాశారని ఫిర్యాదు
- ఆ విలేకరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విజయసాయి రెడ్డి
ఢిల్లీ: వైఎస్ఆర్ సీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి లోక్సభ స్పీకర్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు తనపై తప్పుడు కథనాలు రాశాయని ఫిర్యాదులో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో తనను ప్రశ్నించినట్లు విచక్షణారహితంగా ఆ రెండు పత్రికలు రాశాయని లేఖ రాశారు. ఆ వార్త రాసిన విలేకరులపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్, ప్రివిలేజ్ కమిటీకి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పార్లమెంటుకు ఆ విలేకరుల ఎంట్రీ పాస్లను రద్దు చేయాలని ఆయన అభ్యర్థించారు.
ఆ రెండు పత్రికలు రాసిన కథనం జర్నలిజంలో విలువలను దిగజారుస్తుందని లేఖలో ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.
వార్త రాసేముందు విలేకరులు తన నుంచి ఎటువంటి వివరణ కోరలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
"'నా గౌరవాన్ని, స్థితిని దెబ్బతీసేందుకు తప్పుడు సమాచారం ప్రచురించబడుతోంది" అని విజయసాయి రెడ్డి లేఖలో రాశారు.
అఖిలపక్ష సమావేశంపై తప్పుడు సమాచారం ప్రచురించబడిందని, ఇది తన ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా పార్లమెంటు వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందన్నారు.వార్తను రాసిన విలేకరులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి స్పీకర్ను అభ్యర్థించారు.