రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం
By Newsmeter.Network Published on 13 Jan 2020 8:49 AM GMTవిజయవాడ : రాజధాని రైతుల సమస్యను పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసీ బస్ భవన్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో హై పవర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతుల విషయంలో ప్రభుత్వానికి సానుభూతి ఉందన్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు తన వద్దకు వచ్చారని, తమ సమస్యలు చెప్పారని తెలిపారు. అసలు అసైనీలకు కాకుండా, వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన తమకే భూములు దక్కేలా జీవోను సవరించాలని కోరినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా రాజధాని రైతులు తమ వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇదే చివరి సమావేశం అని చెప్పలేమని బొత్స తెలిపారు. అవసరాన్ని బట్టి సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఉద్యోగుల తరలింపు అంశాన్నీ పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాల వారీగా అభివృద్ధి అనేది తమ ప్రభుత్వ అజెండా అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.