కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌కు షాక్‌..!

By Newsmeter.Network  Published on  12 Feb 2020 3:23 PM GMT
కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌కు షాక్‌..!

ఐపీఎల్‌-2020 సీజ‌న్ ముంగిట‌ కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌కు షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కీల‌క ఆట‌గాడు మాక్స్‌వెల్.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ల‌కు దూరం కానున్నాడు. త‌న మోచేతి గాయానికి గురువారం స‌ర్జ‌రీ చేయించుకోనున్న‌ట్లు మాక్స్‌వెల్ తెలిపాడు. ఈ కారణంగా ఇప్పటికే దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టు నుంచి మాక్స్‌వెల్ త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో డీఆర్క్‌ షార్ట్ ను ఎంపిక చేశారు.

బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2019-20 సమయంలో మ్యాక్స్‌వెల్‌ ఎడమ మోచేయికి గాయం అయింది. స‌ర్జ‌రీ త‌రువాత మాక్స్‌వెల్ కోలుకోవ‌డానికి క‌నీసం 6 నుంచి 8 వారాల స‌మ‌యం ప‌ట్ట‌నుంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఐపీఎల్‌-13వ సీజన్ మార్చి చివ‌రి వారంలో ప్రారంభంకానుడంతో టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ల‌కు మ్యాక్సి అందుబాటులో ఉండ‌డు. టోర్నీ మ‌ధ్య‌లో ఈ ఆట‌గాడు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. గత ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 2 కోట్ల ప్రాథమిక ధరతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా హిట్టర్‌ని.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ రూ. 10.75 కోట్లకి సొంతం చేసుకుంది.

ఇటీవల ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లో పరుగుల వరద పారించాడు. అయితే.. ఐపీఎల్ ముంగిట మోచేతి గాయం, సర్జరీ త‌రువాత మాక్సీ ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.



Next Story