ఘోర ప్రమాదం.. కుప్పకూలిన గనులు .. 22 మంది కార్మికులు మృతి

By సుభాష్  Published on  9 Sep 2020 5:55 AM GMT
ఘోర ప్రమాదం.. కుప్పకూలిన గనులు .. 22 మంది కార్మికులు మృతి

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జియారత్‌ ఘర్‌ పర్వత శ్రేణుల్లో ఉన్న చలువరాతి గనులు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్‌ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్న పలువురు కార్మికులను కాపాడేందుకు కృషి చేస్తున్నాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

అయితే మృతుల్లో 12 మంది పిల్లలున్నట్లు స్థానిక జియో న్యూస్‌ వెల్లడించింది. ప్రావిన్స్‌లోని ఆప్ఘనిస్తాన్‌ సరిహద్దులో ఉన్న సాఫి పట్టణ శివారులో జియారత్‌ ఘర్‌ పర్వత శ్రేణులున్నాయి. ఈ గనుల్లో అత్యుత్తమ మార్బుల్‌ లభిస్తుంది. ఇక్కడ వందలాది మంది కార్మికులు పని చేస్తుంటారు. సోమవారం రాత్రి ఆరో యూనిట్‌లోని గనులు కుప్పకూలాయి. ఇప్పటికి చాలా మంది కార్మికులు శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తిగా శిథిలాలను తొలగించిన తర్వాత ఎంత మంది చనిపోయారన్నది స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.



Next Story