హీరోయిన్ రష్మిక ఫొటోలపై జగిత్యాల కలెక్టర్ ట్వీట్..

By రాణి  Published on  21 Feb 2020 12:48 PM GMT
హీరోయిన్ రష్మిక ఫొటోలపై జగిత్యాల కలెక్టర్ ట్వీట్..

సినీ హీరోయిన్ రష్మిక మండన్నా ఫొటోలపై జగిత్యాల కలెక్టర్ రవి ట్విట్టర్ లో కామెంట్ చేసినట్లు కొన్ని టీవీ ఛానెళ్లు ప్రచారం చేయగా..ఈ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఫలితంగా కలెక్టర్ హోదాలో ఉన్న అతను హీరోయిన్ పై కామెంట్ చేయడమేమిటన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది కలెక్టర్ రవి. వివరాల్లోకి వెళ్తే..బుధవారం మధ్యాహ్నం 2.38 గంటలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రవికి చెందిన ట్విట్టర్ ఖాతా (collector@jagtial) నుంచి హీరోయిన్ రష్మికపై ఒక కామెంట్ పోస్ట్ అయింది. కలెక్టర్ ఖాతా నుంచి ‘చించావు పో రష్మిక’అనే కామెంట్‌ చూసిన కొంతమంది నెటిజన్లు అవాక్కైతే..మరికొంతమంది కలెక్టర్ పై విమర్శలు చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి తెరలేపింది. తీరా చూస్తే..15 రోజుల క్రితమే జగిత్యాల కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న రవి.. అదే సమయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో అధికారిక సమావేశంలో పాల్గొన్నట్లు తేలింది. అయితే ఆయన తన ట్విట్టర్ ఖాతాను ఉపయోగించడం లేదట. గతంలో ఇక్కడున్న కలెక్టర్ ట్విట్టర్ ఖాతాను కలెక్టరేట్ ఉద్యోగి ప్రసాద్ ఉపయోగించేవాడని తెలుస్తోంది. దీనిని బట్టి ఈ కలెక్టర్ ట్విట్టర్ ఖాతా నుంచి ప్రసాదే ఆ కామెంట్ పోస్ట్ చేశాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.Jagtial Collector Commented On Rashmika Photos

ట్విట్టర్ లో తీవ్ర దుమారం రేపిన ఈ విషయంపై మీడియా వర్గాలు కలెక్టర్ ను ప్రశ్నించగా..తనకు ట్విట్టర్ ఖాతానే లేదని, అది ఉపయోగించే సమయం తనకు అంతకన్నా లేదని తెలిపారు. ట్విట్టర్ నుంచి ఆ కామెంట్ పోస్ట్ అయిన సమయానికి తాను మంత్రికొప్పుల ఈశ్వర్ తో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఉన్నానని పేర్కొన్నారు. కలెక్టర్ ట్విట్టర్ ఖాతా నుంచి అభ్యంతరకర పోస్ట్ రావడంపై..ఎస్పీ సింధూ శర్మకు ఫిర్యాదు అందింది. గతంలో కలెక్టర్ ఖాతాను ఉపయోగించిన ప్రసాద్ ను విచారించగా..అతను కాదని తేలింది. వేరే ఉద్యోగులెవరైనా ఈ పని చేశారా అన్న దానిపై విచారణ జరుగుతోంది.

కాంట్రాక్ట్ ఉద్యోగులు సస్పెండ్

కలెక్టర్ రవి ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని తెలుసుకున్న డీఆర్వో అరుణశ్రీ పీఎస్ లో ఫిర్యాదు చేయగా..సైబర్ క్రైం కింద సీఐ జయేశ్ రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. కలెక్టర్ ట్విట్టర్ ఖాతాను ఉపయోగిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రసాద్, మమతలను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Next Story