2000 కోట్ల రూపాయల భారీ స్కామ్.. పలువురు నేతల గుండెల్లో గుబులు

By Newsmeter.Network  Published on  13 Feb 2020 2:46 PM GMT
2000 కోట్ల రూపాయల భారీ స్కామ్.. పలువురు నేతల గుండెల్లో గుబులు

ఫిబ్రవరి 6, 2020 న ఇన్‌కమ్‌ ట్యాక్స్ అధికారులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాయకుల ఇళ్లపైనా, ఆఫీసుల్లోనూ సోదాలు చేయగా భారీగా అక్రమాల చిట్టా బయట పడింది. హైదరాబాద్, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణేలలో ఈ సోదాలు జరిగాయి. మొత్తం 40 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీలలో సోదాలు నిర్వహించగా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టు బహిర్గతమైందని 'సిబిడిటీ' ప్రెస్ నోట్ విడుదల చేసింది.

బోగస్ సబ్-కాంట్రాక్టులు, అధికంగా బిల్లింగులు, తప్పుడు బిల్లింగులు చూపి పెద్ద ఎత్తున డబ్బుల గోల్ మాల్ చేసినట్లు తేలింది. అందుకు సంబంధించిన పత్రాలను, డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈమెయిల్స్, వాట్స్ యాప్ మెసేజీలు కూడా అధికారులకు దొరికాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇతరదేశాలకు డబ్బులు తరలించడం లాంటి విషయాలన్నింటినీ గుర్తించారు. ఓ పెద్ద నేతకు చెందిన మాజీ పర్సనల్ సెక్రెటరీకి చెందిన ప్రాంతంలో ఈ సోదాలు నిర్వహించారు. అలాగే ఎన్నో సంచలన ఆధారాలు కూడా దొరికినట్లు తెలుస్తోంది.

చాలా బోగస్ కంపెనీలను, సబ్ కాంట్రాక్టులను సృష్టించి దాదాపు 2000 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డట్టు తేలింది. ఒకే పనికి ఎక్కువ సార్లు బిల్లులు చూపించి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. అకౌంట్స్, ట్యాక్స్ ఆడిట్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల ముసుగులో సబ్-కాంట్రక్టులు పొందారని.. వాటికి సరైన ఆధారాలు కూడా లేవని అధికారుల రైడ్ లో బయటకు వచ్చింది. ఒకే బిల్లును చూపి బోగస్ కంపెనీలు డబ్బులు దండుకున్నాయని చెబుతున్నారు. లెక్కలు తేల్చని 85 లక్షల డబ్బు.. 71 లక్షల రూపాయల విలువజేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అఫీషియల్ స్టేట్ మెంట్ విడుదల చేశారు అధికారులు. మొత్తం 25 బ్యాంకు లాకర్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వార్త పలువురు నాయకుల గుండెల్లో గుబులు రేపుతోంది.

IT Department on Raids in Telugu states

Next Story