విదేశాల్లో ఐపీఎల్-2020 ప్లే ఆఫ్ మ్యాచులు..!

By Newsmeter.Network  Published on  19 Feb 2020 12:53 PM GMT
విదేశాల్లో ఐపీఎల్-2020 ప్లే ఆఫ్ మ్యాచులు..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌ మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో చైన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. మొత్తం 56 మ్యాచుల గ్రూప్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 17 వరకూ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే.. నాకౌట్‌(ప్లే ఆఫ్) మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలు మాత్రం వెల్లడించలేదు. కాగా.. మే 24న ఫైనల్ జరగనుంది.

ఇదిలా ఉంటే.. గ్రూప్‌ మ్యాచుల వివరాలును వెల్లడించిన బీసీసీఐ.. ఐపీఎల్‌ ప్లే ఆఫ్ మ్యాచ్‌లను ప్రకటించడపోవడానికి ఓ కారణం ఉందట. అందుకు ఓ మూడు ఫ్రాంచైజీలే కారణమట. ఐపీఎల్ 2020 సీజన్ ప్లేఆఫ్ మ్యాచ్‌లు విదేశాల్లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ అభ్యర్థించాయట.

ఇటీవల బీసీసీఐ ఉన్నాతాధికారుల్ని.. ఈ మూడు ఫ్రాంచైజీలకు చెందిన వారు కలిసారని.. ప్లేఆప్‌ మ్యాచులను విదేశాల్లో నిర్వహించాలని కోరారని వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. క్రికెట్‌కి పెద్దగా ఆదరణలేని అమెరికా, కెనడా, సింగపూర్‌లో ఈ ప్లేఆఫ్ మ్యాచ్‌ల్ని నిర్వహించడం ద్వారా.. టోర్నీ ఆదరణ మరింత పెరగనుందని ఫ్రాంఛైజీలు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడిందట.

2008లో ప్రారంభమైన ఐపీఎల్.. అత్యంత ఆదరణ ఉన్న టోర్నీగా విరాజిల్లుతోంది. ఎంతలా అంటే.. ఐపీఎల్ ఆడే రోజుల్లో ఐసీసీ అధికారిక టోర్నీలు నిర్వహించలేనంతగా. ఈ టోర్నీకి పోటీగా.. చాలా దేశాలు లీగ్‌లలో ముందుకు వచ్చినా.. ఐపీఎల్ ముందు అవన్నీ తేలిపోయాయి. మరీ బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుందో వేచి చూడాల్సిందే.

Next Story