కూతురు మృతదేహాంతో ధర్నా.. తండ్రిని బూటు కాలితో తన్నిన పోలీస్
By Newsmeter.Network Published on 26 Feb 2020 11:37 AM GMTసంగారెడ్డి జిల్లా పఠాన్చెరు ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తమ కూతురు చనిపోవడానికి కారణం కాలేజీ యాజమాన్యమే అని నిరసన తెలుపుతున్న ఓ తండ్రిని పోలీసులు బూటు కాలితో తన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పమైంది.
వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా ఎనుగొండకు చెందిన చంద్రశేఖర్, పద్మ దంపతుల కుమార్తె సంధ్యారాణి.. వెలిమల నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం భోజన విరామ సమయంలో కాలేజీ బాత్రూమ్లో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ బుధవారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
మృతదేహాన్ని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకున్నారు. అంతేకాకుండా మార్చురీలో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. మృతురాలి తండ్రిని ఓ పోలీస్ అధికారి బూట్ కాళ్లతో తన్నారు. ఈ సంఘటనతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.