అజ్ఞాత వ్యక్తి ట్రాప్‌లో 'రాహు' సినిమా హీరోయిన్‌..!

By సుభాష్  Published on  2 March 2020 11:09 AM GMT
అజ్ఞాత వ్యక్తి ట్రాప్‌లో రాహు సినిమా హీరోయిన్‌..!

'రాహు' సినిమా హీరోయిన్‌ కృతి గార్గ్‌ ఓ అజ్ఞాత వ్యక్తి ట్రాప్‌లో పడినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ పక్కన హీరోయిన్‌గా నటించాలని 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగ పేరుతో ఓ వ్యక్తి కృతి గార్గ్‌ కు నమ్మించినట్లు తెలుస్తోంది. కాగా, ఆ సినిమా స్టోరీ వినేందుకు ముంబాయికి రావాలని కోరగా, వెంటనే అతని మాటలు నమ్మిన సదరు హీరోయిన్‌ ముంబాయి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే ముంబాయి వెళ్లిన నటి ఫోన్‌ సోమవారం నుంచి కలవడం లేదని 'రాహు' మూవీ డైరెక్టర్‌ సుబ్బు వేదుల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డైరెక్టర్‌ సుబ్బు వేదుల ఏమంటున్నాడంటే..

ఈ సందర్భంగా 'రాహు' డైరెక్టర్‌ సుబ్బు వేదుల మాట్లాడుతూ.. సందీప్‌ రెడ్డి వంగ పేరుతో గత ఐదు రోజులుగా ఒక వ్యక్తి కృతి గార్గ్‌ కి ఫోన్‌ చేస్తున్నాడు. 'రాహు' సినిమాలో మీ నటన చాలా బాగుంది.. మీ లాంటి టాలెంట్‌ ఉన్న హీరోయిన్‌ కోసం ఎంతో వెతుకుతున్నాను. ప్రభాస్‌ పక్కన నటించేందుకు మిమ్మల్ని తీసుకుంటాను అని చెప్పినట్లు సుబ్బు వేదుల పేర్కొంటున్నారు. అంతే కాదు ఆమె కాన్ఫరెన్స్‌ లో నన్ను కూడా కలిపిందని, అతను నాతో రెండు గంటల పాటు మాట్లాడినట్లు చెప్పారు. కానీ ఆయన మాటలు ఎప్పుడూ వినలేదని, ఫోన్‌ పెట్టేసిన తర్వాత యూట్యూబ్‌లో సందీప్‌ ఇంటర్వ్యూలు చూశానని, వాయిస్‌ మాత్రం అతనిది కాదని నిర్ధారించుకున్నానని సుబ్బు చెబుతున్నారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ నంబర్‌ను పోలీసులు ట్రాస్‌ చేయగా, అనంతపురానికి చెందిన నరేష్‌ అనే వ్యక్తి నెంబర్‌గా చూపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సుబ్బా తెలిపారు.

Next Story