కొత్త దారుల్లో.. వెలుగు దీపాలు.!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  1 Sep 2020 1:21 AM GMT
కొత్త దారుల్లో.. వెలుగు దీపాలు.!

నలుగురు నడిచిన దారిలో నడవడం సులభం. పదిలం కూడా! అయితే నిరంతరం కొత్తదనం అన్వేషించే వారు మాత్రం కొత్తదారుల్ని వెతుకుతునే ఉంటారు. నలుగురికి వెలుగు తీరంలా వికసిస్తునే ఉంటారు. ఎంట్రప్రెన్యూర్‌ కుంటుంబంలో పుట్టిన ఈ అక్కాచెల్లెళ్లు.. తండ్రి నుంచి వచ్చిన వ్యాపారాన్నే కొనసాగిస్తూ ఉండిపోవాలనుకోలేదు. ఏదో కొత్తదనం కావాలని పరితపించారు. వారి మేధా మథనం ఫలితంగా సుప్రీం ఇంకుబేటర్‌ పేరిట ఓ కంపెనీ స్థాపితమైంది. కొత్తగా స్టార్టప్‌ ప్రారంభించాలనుకునే వారికి శిక్షణ, మౌలిక వసతుల కల్పనకు ఈ కంపెనీ చేదోడు వాదోడుగా నిలుస్తోంది. చాలా తక్కువ వ్యవధిలోనే దేశావ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ఈ అక్కాచెల్లెళ్ళ విజగాధ హర్‌స్టోరీలో హృద్యంగా వివరించారు.

ఎంట్రప్రెన్యూర్‌ కుటుంబంలో పుట్టిన తన్వి సింగ్లా, దిశ సింగ్లాలు కలిసి సుప్రీం ఇంకుబేటర్‌ కంపెనీని స్థాపించారు. చిన్న వయసులోనే ఈ పని చేయడంతో వారికి ఎంట్రప్రెన్యూర్‌లో ఉండే మజా ఏంటో తెలిసొచ్చింది. బిజినెస్‌ అంటే ఏంటో? దాని ఫలితాలు ఎలా ఉంటాయో మేం మొట్టమొదటి సారిగా తెలుసుకోలిగాం అంటూ ఇద్దరు చెబుతారు. ఉద్యోగాలు సృష్టించగలిగాం.. సమస్యల్ని పరిష్కరించగలిగాం.. ప్యాషన్‌తో కంపెనీని మున్ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం.. అంటూ విజయహాసంతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజీలో చదువుకుని డిగ్రీ తెచ్చుకున్నాక తన్వి, కుటుంబ వ్యాపారంలో ప్రవేశించింది. ఫైనాన్స్‌ సర్వీస్‌ను డిజటలీకరణ చేయడంలో శ్రమించింది. దిశ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌. తను కుటుంబ బిజినెస్‌లో భాగంగా ఫైనాన్షియల్‌ సర్వీస్‌లో కొత్త కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించింది. అంతకు ముందు దిశ ప్రారంభించిన ఫైన్‌టెక్‌ స్టార్టప్‌ యూనివర్సిటీ ఇంకుబేటర్‌గా ఎన్నికయింది. దిశ తొలిసారిగా కొత్తవాటిని కనుగొనడంలో లభించే ఆనందాన్ని చవిచూసింది. అదీ కాకుండా తన స్టార్టప్‌ యూఎస్‌ ఎకోసిస్టమ్‌లో భాగం కావడమే కాకుండా సిలికాన్‌ స్టార్టప్‌లతో అనుసంధానం కావడం మరింత ఆనందానికి కారణమైంది. ప్రస్తుతం దిశ తన హెల్త్‌ కేర్‌ వెంచర్‌ కోసం కృషి చేస్తోంది.

'మా ఇద్దరికి కొత్త వెంచర్లంటే చాలా ఇష్టం. దిశా వెంచర్‌ గేటర్‌ హాచరీలో ఇంకుబేట్‌ అయినపుడు, తనుసిలికాన్‌లో స్టార్టప్‌ స్థాపకులతో ఉన్పప్పుడు చాలా చక్కని అనుభవాలను సొంత చేసుకుంది. సొంతంగా కొత్త వెంచర్‌ ప్రారంభించినపుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో తనకు తెలుసు. అలాగే సిలికాన్‌ అనుభవం వల్ల కొత్తగా స్టార్టప్‌ ప్రారంభించేవారి కష్టనష్టాలు ఎలా ఉంటాయో కూడా బాగా తెలుసుకోగలిగింది.' అని తన్వీ అంటోంది.

వృత్తిగత అనుభవాలు గడించాక తన్వీ, దిశ సుప్రీం స్టార్టప్‌ను ప్రారంభించాలని సంకల్పిం చుకున్నారు. దీని ద్వారా ఢిల్లీలో ఎంట్రప్రెన్యూర్‌ హబ్‌ను తయారు చేయాలన్నది వారి ఆశ. ఈ క్రమంలో శిక్షణ, మౌలిక వసతులు, ఇతర అంశాల్లో తోడ్పాటు…ఇన్ని అంశాలు ఒకే చోట అందించేలా ప్రణాళిక రచించారు. ఇలాంటి ఏక గవాక్ష విధానం స్టార్టప్‌ ప్రారంభించాలనకునే ఔత్సాహికులకు చాలా ఉపయోగంగా ఉంటుందని వారు భావించారు. దాన్నే అమలు చేశారు. వర్చువల్‌గా లభించిన ఈ అనుభవంతో క్రమంగా అక్కాచెల్లెళ్ళు ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించారు.

ఈ స్టార్టప్‌ ప్రారంబానికి ముందు తన్వి, దిశలు చాలా మంది స్టార్టప్‌ స్థాపకులతో మాట్లాడారు. వారు మొదట్లో ఎదుర్కొన్న సమస్యల్ని తెలుసుకున్నారు. చాలా మంది పెట్టుబడులు, నిర్వహణ, మౌలిక వసతులు తదితర సమస్యలనే ప్రస్తావించారు. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ఏం చేయాలో అని వారు ఆలోచించారు. వివిధ వ్యవస్థాపకులతో మాట్లాడి తెలుసకున్న పరిజ్ఞానంతో తమ సుప్రీం స్టార్టప్‌ను 2019 అక్టోబర్‌లో ప్రారంభించారు. తొలి దశలో దేశ నలుమూలల నుంచి వచ్చిన 102 దరఖాస్తులను వడబోసి ఎనిమిది స్టార్టప్‌లను ఎంపిక చేశారు. వాటిని ప్రారంభించడానికి కావలసిన వసతులు తమ సుప్రీం ద్వారా సమకూర్చారు. ఈ సంవత్సరం మరో 30 స్టార్టప్‌లు సుప్రీం బాసట కోసం దరఖాస్తులు చేసుకున్నాయి.

అన్నింటా మేటి.. తనకు తానే పోటీ..!

లాక్‌డౌన్‌కు ముందు వీరు నిర్వహించిన బూట్‌ క్యాంప్‌లో దాదాపు 98 మంది స్టార్టప్‌ స్థాపకులు పాల్గొన్నారు. మెంటర్‌ మ్యాచింగ్‌ కార్యక్రమంలో 30 మంది ఫౌండర్లు పాలుపంచుకున్నారు. అలాగే వర్చువల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో దాదాపు 102 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 'దరఖాస్తుదారుల్లో చాలా వైవిధ్యం కనిసించింది. వివిధ స్టార్టప్‌లు ఇంకుబేషన్‌ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దేశ విదేశాల నుంచి ఈ అప్లికేషన్లు రావడం చాలా ఆనందంగా ఉంటోంది. మనదేశంలో డెహ్రాడూన్, హైదరాబాద్, కేరళ, చత్తీస్‌గఢ్, లక్నో ప్రాంతాల నుంచే కాకుండా యూఎస్, ఉజ్బెకిస్తాన్, మెక్సికో, కెన్యా, బంగ్లాదేశ్‌ లాంటి విదేశాలనుంచి కూడా దరఖాస్తులు రావడం నిజంగా హర్షణీయం' అంటూ తమ కంపెనీ గురించి వివరించారు తన్వి.

'అన్నిటికీ మించి వేర్వేరు స్టార్టప్‌లు ప్రారంభించుకున్న వారు ఒకే చోట కలవడం వల్ల వారి అనుభవాలను ఒకరొకొకరు పంచుకోడానికి గొప్ప అవకాశం లభిస్తోంది. ఈ దారిలో మేం చాలా నేర్చుకోగిలిగాము. స్టార్టప్‌ మూల్యాంకనలో అయిడియాల కన్నా టీమ్‌పైనే ఎక్కువ దృష్టి నిలిపేవాళ్ళం. స్థాపకుల సమూహాన్ని ఒకేచోట చేర్చగలగడం.. ఇంకుబేటర్‌ లాంటి సంక్లిష్ట ఎకో సిస్టమ్‌ నుంచి బిజినెస్‌ మోడల్, నిర్మాణాలు తదితర అంశాలను వెలికితీయగలగడం.. ఇవన్నీ చాలా అరుదైన గొప్ప అనుభవాలే కదా' అంటోంది తన్వి.

'కోవిడ్‌ వల్ల అప్పటి దాకా ముఖాముఖిగా ఉన్న వ్యవహారాలన్నీ ఆన్‌లైన్లో మారిపోయాయి. వాస్తవ సమావేశాల స్థానంలో వర్చువల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నాం. స్టార్టప్‌ ప్రయాణం చాలా భయాలతో కూడుకున్నదే. ఆలోచించడం.. వెంటనే అమలు చేయడం.. కస్టమర్లతో సంప్రదింపులు.. టీమ్‌ ఏర్పాటు.. మార్కెటింగ్‌.. ప్రకటనలు అన్నీ వెంటవెంటనే జరిగిపోవాలి. స్టార్టప్‌ ప్రారంభించాలనుకునే వారు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి..'అంటూ తమ అనుభవాలను తన్వి పంచుకున్నారు.

'తొలి రోజునుంచే బలమైన నెట్‌వర్క్‌ సమకూర్చుకోవాలి. ఎంతమందితో వీలైతే అంతమందిని కలవాలి. వారితో కలసిన ప్రతి సమావేశం నుంచి ఎంతో కొంత గ్రహించాలి. స్టార్టప్‌ నిర్మాణ క్రమంలో అప్పటిదాకా కలకవలి వాళ్ళను కూడా కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఎవరి ఆలోచన, మాటల వల్ల ఏ ప్రయోజనం చేకూరుతుందో ఎవరికీ తెలీదు కాబట్టి సాధ్యమైనంతగా అందరితో కలుపుగోలుగా ఉండటం స్టార్టప్‌ స్థాపకుల ప్రధాన లక్షణం కావాలి..' అంటూ తన్వి ఔత్సాహికులకు సూచనలిస్తోంది.

ఈ అక్కాచెల్లెళ్ళ కలలు సాకారం కావాలని.. మేక్‌ ఇన్‌ ఇండియాకు వీరి తోడ్పాటు ఉండాలని మనమూ ఆశిద్దాం!!

రశ్మీ థాక్రే.. ఓ నేపథ్య మహా శక్తి..!

Next Story