గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి: అమెరికా పరిశోధకులు

By సుభాష్  Published on  7 Oct 2020 4:54 AM GMT
గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి: అమెరికా పరిశోధకులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. పరిస్థితులను బట్టి రూపాంతరం చెందుతూ వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు భారత్‌తో పాటు అన్ని దేశాలు సైతం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు తుది దశకు, మూడు, రెండు దశల్లో ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. మరో వైపు ఈ వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందోనన్న దానిపై స్పష్టత లేదు. ముఖ్యంగా ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందా..? లేదా ..? అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఈ వైరస్‌ వ్యాప్తిపై ఓ ప్రకటన విడుదల చేసింది. గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని సీడీసీ గతంలోనూ తెలిపింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పెట్టి మళ్లీ తొలగించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సమాచారాన్ని తొలగించినట్లు చెప్పిన సీడీసీ తాజాగా మరోసారి గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని నిర్ధారించింది. ఈ మేరకు ప్రజలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్లలో వైరస్‌ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణించి వేరొకరికి సోకే అవకాశం ఉందని వెల్లడించింది. సాధారణంగా తుంపర్లు కొద్ది దూరం మాత్రమే ప్రయాణించి ఆ తర్వాత పేలిపోయి, వైరస్‌ నేలపై పడిపోతుంది. అలాంటి సమయంలో ఆరు అడుగుల దూరం లోపల ఉన్న వారికి వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని సీడీసీ స్పష్టం చేసింది.

తుంపర్ల ద్వారా 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం..

మరో వైపు గాలి, వెలుతురు సక్రమంగా లేని ప్రాంతాల్లో తుంపర్ల ద్వారా వైరస్‌ కనీసం 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉందని, అలాంటి సమయంలో 6 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉన్నప్పటికీ ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది.

అయితే వైరస్‌ గాలిలో ఎంతసేపు బతికి ఉంటుందన్న దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. దీని వ్యవధి కొన్ని సెకన్ల నుంచి గంటల వరకు ఉండొచ్చని సీడీసీ అభిప్రాయపడింది. గాలి గానీ, వెలుతురు గానీ అధికంగా ఉన్న సమయంలో తుంపర్లు త్వరగా పేలిపోవడం, ఆవిరవడం జరుగుతుందని, దీని వల్ల వైరస్‌ తొందరగా నశించి వ్యాప్తి తీవ్రత తగ్గుతుందని తెలిపింది. అందుకే ప్రతి ఒక్కరు అరడుగుల దూరం పాటిస్తూ, మాస్కులు, శానిటైజర్లు తప్పకుండా వాడాలని సూచిస్తోంది.

Next Story