ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
By సుభాష్ Published on 10 Sep 2020 10:45 AM GMTప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేల్ బాలాజీ (45) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. బాలాజీ ఆకస్మికంగా మృతి చెందడం తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. అధు ఇడు ఎడు, కలకపోవతు యారు వంటి టెలివిజన్ షోలతో వడివేల్ ఎంతో పాపులరయ్యాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1991లో విడుదలైన ఎన్ రాసవిన్ మనసిలే అనే సినిమాతో అడుగు పెట్టాడు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే ఓ కామెడీ షోతో ఆయనకు ఎంతో పేరొచ్చింది.
బాలాజీకి ఆర్థిక ఇబ్బందులు
కాగా, గుండెపోటు రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న బాలాజీ.. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వడివేలు.. 15 రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. వడివేల్ బాలాజీ తమిళంలోని కొన్ని చిత్రాల్లో నటించారు. చివరిసారిగా నయనతార నటించిన హిట్ చిత్రం కోలమావు కోకిలాలో వడివేల్ కీలక పాత్ర పోషించారు. బాలాజీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.