యువతి శరీరంలో బుల్లెట్...మాకేం తెలీదంటున్న తల్లిదండ్రులు
By రాణి Published on 23 Dec 2019 7:21 PM IST
హైదరాబాద్ : యువతి శరీరంలో బుల్లెట్ వ్యవహారం ఓ మిస్టరీగా మారింది. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో ఓ యువతి(18)కి ఆపరేషన్ చేస్తుండగా బుల్లెట్ బయటపడటం కలకలం రేపుతోంది. ఈ బుల్లెట్ వ్యవహారంపై వైద్యులు, పోలీసుల తీరుపై యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వస్తే...ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటికి తీసే వరకు తమకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా...రెండేళ్లుగా యువతి శరీరంలో బుల్లెట్ ఉందని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. రెండేళ్లుగా తమ కుమార్తె శరీరంలో బుల్లెట్ ఉంటే... మేమెందుకు దాచుకుంటామని ప్రశ్నిస్తున్నారు.
అస్మా శరీరంలో బుల్లెట్ దాచి పెట్టవలసిన అవసరం తమకు లేదని, బుల్లెట్ వల్ల ఆమెకు గాయాలైన సందర్భాలెప్పుడు కనిపించలేదంటున్నారు. తమ కుమార్తె ఒంటిలో బుల్లెట్ ఉన్న విషయమై నిమ్స్ వైద్యులు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారో అర్థం కాలేదని అంటున్నారు. పోలీసుల విచారణక పూర్తిగా సహకారం అందిస్తామని, ఎవరి తప్పుంటే వారికి శిక్ష వేయించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.