24న బాల‌కృష్ణ 'న‌‌ర్త‌న‌శాల' రీమేక్ వీడియో రిలీజ్

By సుభాష్  Published on  20 Oct 2020 5:37 AM GMT
24న బాల‌కృష్ణ న‌‌ర్త‌న‌శాల రీమేక్ వీడియో రిలీజ్

పౌరాణిక చిత్రాలలో శ్రీ రాముడైనా, శ్రీ కృష్ణుడైనా తెలుగు ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్‌. ఆయన నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడు అనించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయనకు తన తండ్రి ఎన్టీఆర్‌ చిత్రాల్లో 'నర్తనశాల' చిత్రం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని సంకల్పించారు. బాలక్రిష్ణ, సౌందర్య కీలక పాత్రల్లో, బాలక్రిష్ణ స్వీయ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య మొదలైన 'నర్తనశాల' చిత్రం షూటింగ్ కొద్ది రోజులకే ఆగిపోయింది. కాగా.. ఆ సినిమాకి సంబంధించిన 17 నిముషాల వీడియోను దసరా కానుకగా ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు బాలక్రిష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ చిత్రంలో ద్రౌపతిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజు పాత్రలో శరత్‌బాబు, అర్జునుడిగా బాలకృష్ణ నటించారు. అయితే సినిమా కొంత‌భాగం షూటింగ్ పూరైన త‌ర్వాత హెలికాప్టర్‌ ప్రమాదంలో సౌందర్య మృతి చెందింది. దీంతో సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. సినిమాలో ద్రౌప‌ది పాత్ర‌లో సౌంద‌ర్య‌ను త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పిన బాల‌కృష్ణ.. న‌ర్త‌న‌శాల‌ను నిలిపేశాడు.

అయితే న‌ర్త‌న‌శాల రీమేక్ కోసం షూట్ చేసిన కొన్ని స‌న్నివేశాల‌తో కూడిన పుటేజీని బాల‌కృష్ణ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్బంగా నందమూరి బాలక్రిష్ణ తన సోషల్ మీడియా ద్వారా పలు వివరాలు వెల్లడిస్తూ.. "నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్.బి.కె థియేటర్‌లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది'' అని తెలిపారు.

'' అర్జునుడిగా నేను , ద్రౌపదిగా సౌందర్య , భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24న నెరవేరబోతోంది" అని బాలయ్య బాబు వెల్లడించారు

Next Story