హయత్‌ నగర్‌ కార్పోరేటర్‌పై దాడి

By సుభాష్  Published on  18 Oct 2020 7:17 AM GMT
హయత్‌ నగర్‌ కార్పోరేటర్‌పై దాడి

హైదరాబాద్‌ను వరుణుడు ముంచెత్తాడు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వరదనీరు పోయే దారిలేక, నిత్యావసరాలు దొరక్క అల్లాడుతున్నారు. దీంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కార్పోరేటర్‌ సామా తిరుమల్‌ రెడ్డి ఆదివారం ఉదయం బంజారా కాలనీకి వెళ్లారు. గతంలో తాము నాలా భూములు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులు, కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చి సమీపంలోని నాలా కబ్జాకు గురవడంతో వరదనీరు ఎక్కడిక్కడ నిలిపోతోందని.. నాలా కబ్జాలే ముంపుకు కారణం అంటూ కోపోద్రిక్తులయ్యారు. ఈ క‍్రమంలో ఓ మహిళ.. కార్పోరేటర్‌ చొక్కా పట్టుకుని నిలదీశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కార్పోరేటర్‌ కంగు తిన్నారు. ఆ తర్వాత స్థానికులకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. మొన్న ఉప్పల్‌ ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Next Story