కరోనాతో మరో తెలుగు సీనియర్‌ నటుడు మృతి

By సుభాష్  Published on  24 Sep 2020 2:43 AM GMT
కరోనాతో మరో తెలుగు సీనియర్‌ నటుడు మృతి

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖుల వరకు కరోనా మహమ్మారి కాటేస్తోంది. తాజాగా సీనియర్‌ నటుడు కోసూరి వేణుగోపాల్‌ కరోనాతో కన్నుమూశాడు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందులో కరోనా పాజిటివ్‌ రావడంతో ఆరోగ్యం విషమించి గురువారం తెల్లవారుజామున మరణించారు. వేణుగోపాల్‌ 'మర్యాదరామన్న', 'విక్రమార్కుడు', 'ఛలో' వంటి అనేక సినిమాల్లో నటించారు.

ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం. ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు. కాగా, వేణుగోపాల్‌ రాజమౌళి సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. మర్యాద రామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో నటించిన ఆయనకు మంచి గుర్తింపు లభించింది. తెలుగులో దాదాపు 30 సినిమాలకుపైగా నటించారు. ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇలా ఒక్కొక్కరు కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం అవుతోంది.

ఇప్పటికే సినిమా పరిశ్రమలో ఎంతో మందికి కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో నిర్మాత పోకూరి రామారావుతో పాటు మరో నిర్మాత కూడా కన్నుమూశారు. వేణుగోపాల్‌ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా కూడా ఫేస్‌ చూస్తేనే ఈయనేనా అంటారు. రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆయన మరణం పట్ల తెలులుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.



Next Story