లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: తెలంగాణలో కోటిన్నర లీటర్ల బీరు వృధా.!

By సుభాష్  Published on  1 May 2020 6:15 AM GMT
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: తెలంగాణలో కోటిన్నర లీటర్ల బీరు వృధా.!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఈ లాక్‌డౌన్‌ కారణంగా అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం వచ్చేది మద్యం వల్లనే. లాక్‌డౌన్‌ కారణంగా మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోవడంతో సుమారు కోటిన్నర లీటర్ల బీరు వృధాగా పోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్సైజ్‌శాఖ నిబంధనల ప్రకారం బీరు తయారైన నాటి నుంచి ఆరు నెలల గడువు వరకు వాడుకోవచ్చు.

ఇక లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఫ్యాక్టరీలు, ఎక్సైజ్‌ డిపోలు, మద్యం షాపుల్లో సుమారు 20 లక్షల పెట్టెల బీరు నిల్వ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక బీరు తయారీ తర్వాత దాని వాడుక గడువు ముగిసిపోతుంది. దీంతో బీరు పనికి రాకుండా పోతుంది. ఇక సాధారణ లెక్కల ప్రకారం.. ప్రతీ సంతవ్సరం ఏప్రిల్‌ లో సరాసరిన రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పెట్టెల వరకు బీరు అమ్మకం జరిగేది. దీని విలువ సుమారుగా రూ.600 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, బీర్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ మొదటిస్థానంలో ఉంది. ఏప్రిల్‌ రాష్ట్రంలో 50 లక్షల పెట్టెల బీరు వినియోగం ఉండగా, ఇందులో 50 శాతం వరకూ నగరంలోనే అమ్ముడుపోయేది.

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. లాక్‌డౌన్‌ను మరింత పొడిగించే అవకాశాలు ఉండటంతో మరింత నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. ఇక రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో సుమారు రూ. 1200 కోట్ల వరకూ బీర్ల అమ్మకాలు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇన్ని లీటర్ల బీరు నేలపాలు కానుంది.

Next Story