రెడ్యానాయక్‌పై పిల్‌.. నివేదిక సమర్పించాలని హోంశాఖకు ఆదేశం

By అంజి  Published on  6 Jan 2020 12:28 PM GMT
రెడ్యానాయక్‌పై పిల్‌.. నివేదిక సమర్పించాలని హోంశాఖకు ఆదేశం

మహబూబాబాద్‌: మాజీ మంత్రి, ప్రస్తుత డోర్నకల్‌ శాసన సభ్యుడు రెడ్యానాయక్‌పై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. తన ఇంటి ముందు ఉన్న స్కూల్‌ని కూల్చివేసి పార్కింగ్‌కి వాడుకున్నారని పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ దాఖలు చేసిన రెడ్యానాయక్‌ సొంత గ్రామస్తుడు (మంచ్య తండా ఉగ్గంపల్లి గ్రామం చిన్నగూడురు మండలం మహబూబాబాద్‌ జిల్లా) డి.ఎస్‌.వెంకన్న నాయక్‌. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన మూడు ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని పిటిషన్‌ దాఖలు చేశారు. తన భార్య, ఇద్దరు కొడుకుల పేర్లను మార్చి మొదటి విడతలో ఇందిరమ్మ గృహాలు పొందారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద తన పేరుపై ఉన్న భూమిని కొడుకు పేరుపై ఉన్నట్లు చూపించి నిధులు పొందారని పిటిషన్‌ చెప్పారు. పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు స్వీకరించి విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.

Next Story