రెండు నెలల జీతాలు ఇవ్వలేం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 April 2020 1:45 PM GMT
రెండు నెలల జీతాలు ఇవ్వలేం

అస‌లే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ‌ స్పైస్‌ జెట్..‌ ఏప్రిల్, మే నెలలకు సంబంధించి పైలట్లకు ఎలాంటి జీతాలు చెల్లించలేమ‌ని ప్ర‌క‌టించింది. అలాగే.. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్రం అనుమతించిన కార్గో విమానాలు నడుపుతున్న పైలట్లకు జీతాలు ఇస్తామని.. అది కూడా విమానాలు నడిపిన గంటలకు మాత్ర‌మే చెల్లింపులు ఉంటాయని స్పైస్‌ జెట్ పేర్కొంది. ఈ విష‌య‌మై సంస్థ‌ విమాన ఆప‌రేష‌న్స్ ఇన్‌చార్జ్ కెప్టెన్ గురుచరణ్ అరోరా.. పైలట్లకు లేఖ రాశారు. ఇదిలావుంటే.. కేంద్ర ప్ర‌భుత్వం విమాన ప్రయాణాలపై ఆంక్షలు సడలించిన వెంటనే సర్వీసులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.

ఇక మ‌రో విమాన‌యాన సంస్థ ఇండిగో.. తమ సంస్థలో పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగులకు ఏప్రిల్‌ నెల పూర్తి జీతం ఇస్తామని గ‌త‌వారం ప్రకటించింది. ఈ‌ నెల జీతంలో కోత విధించాల‌ని చూసినా.. ప్రధాని మోదీ సూచన మేరకు ఆ నిర్ణ‌యాన్ని విరమించుకుంది. ఇక‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్ ఇండియా పైలట్లు.. త‌మ‌కు ఫిబ్రవరి నెలకు సంబంధించి తమకు ‘ఫ్లైయింగ్ అలవెన్సు’ ఇంకా ఇవ్వలేదని.. కేంద్ర విమానయాన శాఖ మంత్రికి లేఖ రాశారు.

Next Story