కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు.. మెగాస్టార్ చిరంజీవి సందేశం
By అంజి Published on 19 March 2020 8:09 AM GMTముఖ్యాంశాలు
- కరోనాను లైట్ తీసుకోవద్దంటూ సినీ స్టార్ల సందేశం
- కరోనా రాదన్న నిర్లక్ష్యం వద్దు- చిరంజీవి
- మోచేతి వరకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి-చిరంజీవి
కరోనాపై పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా కరోనాపై చిరంజీవి సందేశం ఇచ్చారు. మెగస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం.. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోన్న సమస్య కరోనా. అయితే మనకు ఏదో అయిపోతుందేమోన్న భయం గానీ, మనకు ఏమీ కాదు అన్న నిర్లక్ష్యం గానీ ఈ రెండు పనికి రావు. జాగ్రత్తగా ఉండి.. ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. అన్నారు.
'జన సముహాలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవడం ఉత్తమం. వ్యక్తి గతంగా మన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోచేతి వరకు వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్ఛీప్ లాంటివి అడ్డం పెట్టుకోవడం లేదా టిష్యూ పేపర్ అడ్డంపెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్త బుట్టలో వేయండి. మీ చేతిని కళ్లకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు అలసటలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.' అని చిరంజీవి చెప్పారు.
మీ జలుబు, దగ్గు ఇతరులకు అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటే.. కరోనా ప్రమాదకారి కాకపోయిన, నిర్లక్ష్యం చేస్తే మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరీ మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం.. అదే ఉత్తమం. నమస్తే.' అని పిలుపునిచ్చారు.