వంశీతో సంబంధం లేదు..!: జూ. ఎన్టీఆర్
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Nov 2019 9:12 AM GMTవంశీతో సంబంధం లేదు..!: జూ. ఎన్టీఆర్- రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాస్తవాలు ఏంటో..పుకార్లు ఏంటో తెలుసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. కొన్ని సార్లు టీవీల్లో చూసి తెలుసుకుంటాం. మరికొన్ని సార్లు తెలిసిన వారు చెబితే తెలుసుకుంటాం. రాజకీయం అంటేనే ఎక్కడ స్విచ్ వేయాలో, ఎక్కడ స్విచ్ వేయకూడదో తెలిసి ఉండాలి. రాజకీయం అంటే ఓ చదరంగం. ఎత్తులు పై ఎత్తులు చాలా ముఖ్యం.
వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వంశీ పార్టీ అంశం రాజకీయంగా ఊపేస్తుంది. గన్నవరం ఎమ్మెల్యే వంశీ సీఎం వైఎస్ జగన్ ను కలిసినప్పటి నుంచి రాజకీయ వేడి రాజుకుంది. వంశీ, కొడాలి నాని బెస్టె ఫ్రెండ్స్ అని అంటారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చి రాజకీయాల్లో ఉన్నారు. ఇద్దరూ ఒకే జిల్లా వారు. ఇద్దరూ ముక్కుసూటి మనుషులు. కాని..కొడాలి నాని టీడీపీని వదిలి వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఈ పార్టీ నుంచి రెండు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మంత్రి కూడా. వంశీ కూడా టీడీపీలో ఉంటూ గన్నవరం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కొడాలి నానినే దగ్గరుండి వంశీని సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే...వంశీని కొడాలి నాని వైఎస్ జగన్ దగ్గరకు తీసుకెళ్లడం వెనుక..జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహం ఉందని టీడీపీ నేతలు గత కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. కాస్తాకూస్తో రాజకీయం తెలిసిన వారు కూడా విశ్వసిస్తున్నారు.
గత వారం రోజులుగా అమరావతిలో జరుగుతున్న రాజకీయ యుద్ధంపై ఓ ఇంటర్వ్యూలో జూ. ఎన్టీఆర్ స్పందించారు. వంశీతో సంబంధం లేదు..!: జూ. ఎన్టీఆర్. తనకు వంశీ ఒక ప్రొడ్యూసర్గా మాత్రమే తెలుసన్నారు. అతని రాజకీయ జీవితంతో తనకు సంబంధంలేదని జూనియర్ కుండబద్దలు కొట్టారు. టీవీల్లో బ్రేకింగ్ లు, చర్చలు చూసి చాలా ఆశ్చర్యమేసిందన్నారు. తన తాత పెట్టిన పార్టీకి తాను వ్యతిరేకంగా ఎలా పని చేస్తానని అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం సినిమాలు చేస్తున్నానని ..ఏపీలో జరుగుతున్న రాజకీయాలతో తనకు సంబంధంలేదన్నారు జూనియర్ ఎన్టీఆర్.
ఇక..వంశీ రాజకీయ గొడవ ఏపీని ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. చంద్రబాబు ఇసుక దీక్ష చేసిన నవంబర్ 14నే టీడీపీ అధినేతపై వంశీ విమర్శలు గుప్పించారు. దీనిపై టీడీపీ నేత రాజేంద్రప్రసాద్, వంశీ మీడియా సాక్షిగా తిట్టుకున్న సంగతి తెలిసిందే. 'రా' అనే దగ్గరకు ఇద్దరూ బూతు పురాణం విప్పుకున్నారు. రాజేంద్రప్రసాద్ ను వంశీ "ఒంటి కన్ను" వాడు అని సంబోధించి విమర్శల తీవ్రతను కూడా పెంచాడు. "నీ అయ్యా" చెప్పాడా..అంటూ కూడా వంశీ రాజేంద్రప్రసాద్ పై విరుచుకుపడ్డారు. వంశీ మాటలను టీడీపీ ఖండించకపోవడంపై రాజేంద్రప్రసాద్ కినుక కూడా వహించారు. తరువాత కొనకళ్ల నారాయణ, బోడే ప్రసాద్ వెళ్లి రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు.
- వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్